తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్రెడ్డి పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం చెందింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది.
రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు పిటిషనర్ కొండల్ రెడ్డి. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం చెల్లించలేదని పిటిషనర్ కోర్టుకి తెలిపారు. పలు జిల్లాల్లో రైతు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉందన్నారు పిటిషనర్. దీనిపై గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
పరిహారం చెల్లింపునకు సంబంధించి జీవోలు జారీ చేసి తర్వాత ప్రక్రియ వదిలేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. చనిపోయిన రైతుల కుటుంబాలు రోజూ ఇబ్బంది పడాలా అని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది హైకోర్ట్.