రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతుల్లేవు అని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి… కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలు, ఏపీ నేతల విమర్శలపై హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలాంటి అనుమతులు లేకున్నా.. ఏపీ ప్రభుత్వం కృష్ణ నది నీటిని తరలించే ప్రాజెక్టు పనులు చేస్తోందని విమర్శించారు.. అక్రమంగా కృష్ణ నీటిని తరలించే పనిని ఏపీ సర్కారు మొదలుపెట్టిందని ఫైర్ అయిన ఆయన.. అక్రమ నీటి తరలింపుతో
పాలమూరు, రంగారెడ్డి, మెదక్ రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. మేం ఎలాంటి పనులు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు అబద్ధం చెబుతోందని ఆరోపించారు మంత్రి ప్రశాంత్రెడ్డి.. ఇక, కృష్ణ బోర్డు.. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపాలని ఆదేశించిందన్నారు.
also read ఏపీ కరోనా అప్డేట్..
మరోవైపు.. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకులు నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. కృష్ణ బోర్డు ఆదేశాలపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం చెబుతారు? అని ప్రశ్నించిన ఆయన.. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు ఎటువంటి అనుమతులు లేవన్నారు.. సక్రమమైతే పనులు ఆపాలని కేఆర్ఎంబీ ఎందుకు ఆదేశాలిస్తుంది? అని ప్రశ్నించారు.. ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ఏడు రోజుల్లోనే కృష్ణాబోర్డుకు లేఖ రాశామని.. సర్వే అని చెప్పి పనులు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. ఇక, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిందే కాంగ్రెస్ హయాంలో అన్నారు మంత్రి.. పోతిరెడ్డిపాడు కాల్వల ప్రారంభానికి డీకే అరుణ హారతి పట్టారని, పొన్నాల లక్ష్మయ్య కొబ్బరికాయ కొట్టారని గుర్తుచేశారు. కుడి కాలువ పనులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ను డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్రెడ్డి. కాగా, గత కొంతకాలంగా కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.