ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన.. తెలంగాణ ఏమి చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా…? అని ప్రశ్నించారు.. ఇక, ఇతర ప్రాంతాల ప్రజలు మా అతిథులు వ్యాఖ్యానించిన జగదీష్ రెడ్డి.. అక్కడి ప్రజల బాగోగులపైనే ఆంధ్ర సర్కార్ కు సోయిలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డ జగదీష్ రెడ్డి.. మా ఇష్టమోచ్చినట్లు మేం చేస్తాం. మేం చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు.. ఏపీ పాలకులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని.. కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. దొంగదారిలో, అక్రమ పద్ధతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని.. తప్పకుండా చేసుకుంటాం.. ఎవరో ఆర్డర్ ఇస్తే వినాల్సిన అవసరం మాకు లేదన్నారు. మూడో వ్యక్తి జోక్యం లేకుండా ఇద్దరం కూర్చోని మాట్లాడుకుందాం అని మొదట ప్రతిపాదించింది తెలంగాణ సీఎం కేసీఆరేనని గుర్తుచేసిన ఆయన.. కానీ, దానిని తీసుకోవడంలో పక్క రాష్ట్ర సీఎం విజ్ణత లోపించిందన్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం.. అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదు.. ఆపే హక్కు ఎవరికి లేదన్నారు. ఇవి పాతరోజులు కావు.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రం అన్న జగదీష్ రెడ్డి.. ఎవరి చెప్పుచేతుల్లో లేదు.. మీ బానిసలు అధికారంలో లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు మీ ప్రాంత వాసులు బానిసలుగా చేసుకొని ఆటలు సాగించారు. ఇప్పుడు సాగవని హెచ్చరించిన ఆయన.. ఇకనైనా మీ కుప్పిగంతలు ఆపండి..రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రండి అని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతంగానికి లబ్ధి చేకూరేలా తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ణతతో ఆలోచిస్తారని.. మీ జేబులో మేం దోచుకుంటాం.. మా జేబుల వైపు చూడవద్దు అంటే ఇక్కడెవరూ అమాయకులు లేరని.. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటున్నారు కేసీఆర్ అని తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.