సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన అన్నారు. జీవో 317 ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని, వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
చిక్కుముడులు, అపోహలు, అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా చర్చలు జరపాలి. అప్పటివరకు ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ నేను రాజును నాకే అన్నీ తెలుసు.. నేను చెప్పిందే చేయాలి అని హుకుం జారీ చేస్తున్నారు. 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. వీరి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వీరి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నారు ?ఉద్యమంలో చెప్పి సీఎం అయ్యాక మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు.