జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిపై విచక్షణరహితంగా డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని, చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం చితకబాదాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్నుకుంటు పిడిగుద్దులు గుప్పించాడు నయీం.
విద్యార్థి ఎంత ప్రాధేయ పడిన కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే.. విషయం తెలుసుకున్న ఆర్ఎల్ఎసీ(రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్)సయ్యద్ హమీద్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా డిప్యూటీ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ ఘటన వారం రోజుల క్రితం జరుగగా.. సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో వార్డెన్ పై చర్యలకు ఆదేశించారు.