నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి వెళ్లిన యువజన కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని దుయ్యబట్టారు. ఏడేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయలేదన్నారు. 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంతవరకు ప్రకటించలేదని మండిపడ్డారు.
Read Also: చిన్న జీయర్ స్వామిని కలిసిన మొగులయ్య
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుల రవి కాంత్ గౌడ్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఇదే సంస్కృతి అని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి లో బాగంగా జడ్చర్లలో పోలీసులు అత్యుత్సాహం వలన యువజన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందన్నారు. పోలీసులు శాంతి భద్రతలు కాపాడకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా దాడులు అరెస్టులు చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకోసమేనా యువకులు ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ సంపాదించుకున్నది అని విమర్శించారు. తెలంగాణలో అరాచక నియంత పాలన కొనసాగుతుందన్నారు. వెంటనే ఖాళీ లు అన్ని భర్తీ చేసి, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.