తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హజరై ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నేడు ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. శభాష్ బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు మోడీ. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ పై ఆరా తీశారు. ప్రజా సంగ్రామ సేనతోపాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని సంజయ్కు మోదీ సూచించారు. ‘‘మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీలు నడిచాను’’ అని మోదీకి బండి సంజయ్ వివరించారు. ‘‘నడిచింది నేనయినా.. నడిపించింది మీరే.. మీరు చెప్పిన ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని సంజయ్ ను అడిగిన మోదీ.. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న బండి సంజయ్, కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తుండoతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చానని ప్రధానికి బండి సంజయ్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సూచనలు సత్ఫలితాలు ఇచ్చాయని, మీ స్పూర్తితో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తున్నారని, ప్రధానమంత్రి కాల్ తో కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్.