MLA Raja Singh Controversial Comments On Love Jihad: ‘డేట్ రాసి పెట్టుకోండి.. నన్ను వందకు వంద శాతం చంపేస్తారు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనపై ఇవాళ కాకపోయినా రేపు బుల్లెట్లను ఉపయోగిస్తారని.. ఈ విషయం తనక్కూడా తెలుసని కుండబద్దలు కొట్టారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, ముస్లిములుగా కన్వర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తీర్చిదిద్దుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో హిందువులతోనే హిందువులపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారన్నారు.
ధర్మం కోసం ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో.. వారి గొంతులు, తలలు నరుకుతున్నారని ఆరోపణలు చేశారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనని కూడా ఏదో ఒకరోజు మట్టుబెడతారన్నారు. అయితే.. చచ్చేముందు తనదొక కల ఉందని, అందరూ తనలాగే తయారవ్వాలని, ఇదే తన సంకల్పమని రాజాసింగ్ పేర్కొన్నారు. తాను ఛత్రపతి శివాజీ హిస్టరీ చదివానని.. బతకాలంటే ఆయనలా బతకాలని, చావాలంటే ఆయన కొడుకు శంభూజీలాగా చావాలని అన్నారు. ఇది కేవలం తన ఒక్కడి కల మాత్రమే కాకూడదని, ప్రతి ఒక్క హిందువు కల కావాలని పిలుపునిచ్చారు. అందరూ ధర్మ రక్షణకు పాటుపడాలని, లేకపోతే హిందువులంతా రేపు కన్వర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కామెంట్స్ చేశారు.
రాజకీయం వేరు, ధర్మం వేరు అని చెప్పిన రాజాసింగ్.. ‘‘మీరు ఏ పార్టీలో ఉండాలనుకుంటారో అది మీ ఇష్టం, ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించొచ్చు, మీ ఆలోచనల్లో కొన్ని మార్పులు తెస్తే చాలు’’ అని అన్నారు. ధర్మాన్ని రక్షించాలంటే.. బీజేపీలోనే ఉండాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఎందుకంటే.. టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఉంటే పూజలు చేయరా? అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అనే ముద్ర ఎందుకు? రాముడు బీజేపీకి మాత్రమే చెందినవాడా? టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి కాదా? అంటూ నిలదీశారు. లవ్ జీహాదీని ఆపండి? మత మార్పిడిని అడ్డుకోండని రాజాసింగ్ ప్రతి రాజకీయ నాయకుడిని కోరారు.