తెలంగాణ లో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం జరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, లక్ష 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ లో 19 వేలు, బీహార్ లో 8.950 కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశారన్నారు. కానీ తెలంగాణలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు.
కాదని అబద్దాలు మాట్లాడే బీజేపీ నేతలకు సవాల్ అబద్ధమైతే నేను రాజీనామా చేస్తా, నిజమయితే మీరు మీ పదవులకు రాజీనామా చేస్తారా ? అంటూ మంత్రి సవాల్ విసిరారు. టీఎస్ ఐ పాస్ ద్వారా ఏడేళ్లలో కొత్తగా 17 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, 13 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రైవేట్ లో ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఐటీ ఎగుమతులు రూ. 50 వేల కోట్లు ఉంటే నేడు రూ.1లక్ష 40 వేల కోట్లకు పెరిగింది. 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. గతంలో ఎప్పుడైనా ఇలా ఉన్నాయా ? అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఎలాంటి సవాలుకైనా నేను సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు.