Minister KTR Talks About Another 43 Step Well Development: హైదరాబాద్లోని బన్సీలాల్పేట మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో 43 మెట్ల బావులను ఆధునీకరిస్తామని మేయర్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక బన్సీలాల్ మెట్ల బావి గురించి మాట్లాడుతూ.. గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి, ఈ మెట్ల బావికి కొత్త వైభవాన్ని అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు. టన్నుల కొద్ది చెత్తను స్వహస్తాలతో తీసి, ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్కు అందించిన పారిశుద్ధ కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని కేటీఆర్ సూచించారు. చెత్త పారేయకుండా.. ఈ బావిని సంరక్షించుకునే బాధ్యత స్థానికులదేనని అన్నారు. మెట్ల బావిని కాపాడుకుంటూ.. హైదరాబాద్ నగరానికి స్ఫూర్తిగా నిలవాలని స్థానికులకు పిలుపునిచ్చారు. ఈ మెట్ల బావి నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 25 సార్లు పరివీలించారని, ఎంతో కష్టపడి దీనిని పునరుద్ధరించామని తలసాని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బావిని పునరుద్ధరించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉందని.. 3,900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి, 863 ట్రిపుల్లో లారీల్లో ఆ చెత్తను తలరించారన్నారు. మొత్తం రూ. 10 కోట్ల వ్యయంతో ఈ బావిని సుందరీకరించారన్నారు. భవిష్యత్ తరాలు గుర్తించుకునే విధంగా ఆధునీకరించిన ఈ బావిని.. నీరు ఉబికి వచ్చేలా, పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఇతర పనులు ప్రారంభించుకున్నామని కేటీఆర్ అన్నారు. కానీ.. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే సంతోషం కలుగుతుందని, ఈ మెట్ల బావి పునరిద్ధరించుకోవడం అందులో ఒక సందర్భమని పేర్కొన్నారు. నగరం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే.. భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లవుతామని పేర్కొన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీకుతుబ్షాహీ టూంబ్స్ వద్ద కూడా ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు ఆధునీకరించారన్నారు. అదే విధంగా మొజాం జాహీ మార్కెట్, మీరాలం మండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్ పేట్ సరాయి మొదలైన వాటిని అద్భుతంగా ఆధునీకరించి.. హైదరాబాద్ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా గుర్తింపు తెస్తామని కేటీఆర్ తెలిపారు.