ప్రధాని మోడీ తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండంటూ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho).. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డీఎన్ఏ లోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు.
Bandi Sanjay : మా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేశారు
అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలు ప్రాధాన్యతలను అధ్యయనం చేయండి. డబుల్ ఇంజిన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి- కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి. అంటూ ఆయన లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.