రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి ఓ నంబర్కు ఫోన్ చేశాడు.
Read Also: పెరుగుతున్న పాజిటివిటీ రేటు… లాక్డౌన్ తప్పదా?
అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తనకు గూగుల్ పేలో ఓ రూపాయి పంపమని అడిగాడు. దీంతో చంద్రమోహనేశ్వర్రెడ్డి తన గూగుల్ పే నుంచి ఒక రూపాయి పంపించాడు. దీంతో ఆయన బ్యాంకు ఖాతా నుంచి వెంటనే రూ.99 వేలు నగదు డెబిట్ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన చంద్రమోహనేశ్వర్రెడ్డి వెంటనే పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.