తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్ఘడ్ మాజీ సీఎం రమణ్సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస, నియంత, గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సహయ సహకారాలను అందిస్తుందన్నారు. ఇంతటి గొప్ప పార్టీలో కొనసాగడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
ఘటనలో జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు అయినా మౌనంగా ఉండటం బాధేస్తోంది. మాకు జైలు కొత్త కాదు ఎన్నోసార్లు జైలుకు వెళ్లామన్నారు. మాజీ ఎమ్మెల్యే దళిత మహిళ అని చూడకుండా ఆమెకు ఈ ఘటనతో సంబంధం లేకపోయినా అరెస్టు చేయడం దారుణమన్నారు. నేను కోవిడ్ నిబంధనలను పాటించి ‘జాగరణ’ చేస్తే సీఎంకు వచ్చిన నొప్పి ఏంది? మేం చాలా రోజుల నుండి 317 జీవోను సవరించాలని పోరాడుతున్నాం. సీఎం సోయిలోకి రావాలని మేం దీక్ష చేస్తుంటే మీరు గ్యాస్ కట్టర్లు, గునపాలు పెట్టి గేట్లు బద్ధలు కొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల నువ్వు సాధించి ఏంది? అంటూ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. నీ చేష్టలతో కేసీఆర్ జైలుకు వెళ్లాలని జనమంతా కోరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా 317 జీవోను సవరించాలి డిమాండ్ చేస్తున్నాం.
Read Also:బంగారు తెలంగాణాలోరక్షకులు.. భక్షకులుగా మారారు: తరుణ్ చుగ్
నీ కొడుకుకు చెప్పు… భాషను సంస్కారవంతంగా వాడమను. ఇప్పటికైనా తండ్రి, కొడుకులు భాషను మార్చుకోవాలన్నారు. నేను మళ్లీ చెబుతున్నా కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. నీ గడీలు బద్ధలు కొట్టడం ఖాయం తరిమి తరిమి కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు.. ఉద్యోగ, ఉపాధ్యాయులారా ఇప్పటికైనా మీరు బయటకు రండి… ఇది మీ జీవితాలతో ముడిపడిన సమస్య. ఇప్పుడు స్పందించకపోతే మీ జీవితాలు నాశనమవుతాయి. మీకేమైనా మేమున్నాం… మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలిగితే .. మేం అధికారంలోకి వచ్చాక చూసుకుంటాం అని బండి సంజయ్ అన్నారు.
ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాం: డాక్టర్ లక్ష్మణ్
కరీంనగర్ చేరుకన్న బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీ మడమ తిప్పేది లేదు. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తామన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడతాం. పేదలకు రెండు పూట కడుపు నింపే పథకాన్ని మొదటి సారి ప్రవేశపెట్టిన నాయకుడు డాక్టర్ రమణ్ సింగ్ను అంతా ‘చావల్ బాబా’ అని పిలుస్తారని లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్పై జరిగిన దాడి, అక్రమ కేసుల పూర్వాపరాలను రమణ్సింగ్ తెలుసుకున్నారని లక్ష్మణ్ వివరించారు.