KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఈ అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో బుల్డోజర్లను సవాల్ చేసిన రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని నిలదీశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై కేటీఆర్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ప్రదర్శించారు. “ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం” అనే నినాదంతో ప్రజెంటేషన్ కొనసాగింది.
కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన బాధితులు సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. “హైడ్రా పేరుతో ప్రభుత్వం రాజధానిలో అరాచకాన్ని సృష్టిస్తోంది. పేదల ఇళ్లు కూల్చివేసి వేల కుటుంబాలను వీధులపైకి నెట్టేస్తోంది,” అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధనికులను వదిలి పేదలపైనే ప్రతాపం చూపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. “ఒక మంత్రి చెరువును కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. మరో మంత్రి హిమాయత్ సాగర్ వద్ద నిర్మాణాలు చేస్తున్నారు. కానీ హైడ్రా అధికారులు అటువైపు చూడటానికి కూడా భయపడుతున్నారు,” అని అన్నారు.
“పేదల ఇళ్లు కూల్చే ముందు కోర్టు సమయం కూడా ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు మాత్రం కోర్టు ద్వారా స్టే తెచ్చుకునే అవకాశం పొందారు. ఇదేనా మీ న్యాయం?” అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువులో ఇల్లు కట్టినా నోటీసు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. “హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆధునిక సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, 42 ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించాం. కానీ ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది కేవలం కూల్చివేతలే,” అని దుయ్యబట్టారు.
కూల్చివేతల సమయంలో గర్భిణిని తోసేశారని, ఒక చిన్నారి ఆకలితో అలమటించిందని చెబుతూ కేటీఆర్ వీడియోలను ప్రదర్శించారు. “ఇలా పేదల కన్నీళ్లు తుడవకుండా కాంగ్రెస్ సర్కార్ హింసకు పాల్పడుతోంది,” అని అన్నారు. తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “ఇంకా 500 రోజుల్లో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి వస్తుంది. బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.