మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది… టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనుండగా.. ఇప్పటికే టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేశారని.. రేపోమాపో అధికారికంగా ఆమె పేరును ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ.. టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే తనను పోటీచేయాలని పార్టీ నేతలు కోరారన్న ఆమె.. ఒకవేళ హుజురాబాద్లో పోటీ చేసినా.. మళ్లీ వరంగల్కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్లో పోటీచేస్తానని స్పష్టం చేశారు. మరి.. ప్రస్తుతానికి హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడడంతో.. ఆమెను అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది వేచిచూడాల్సిన విషయంగా మారింది.