తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే.. జూన్ 27 నుండి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 11 కాగా.. ఆగస్ట్ 14న ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నిన్న మరో 10వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఇందులో గురుకులాలకు సంబంధించిన మొత్తం 9,096 పోస్టులు ఉండగా.. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా మరో 995 పోస్టులు భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.