రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పని చేస్తున్న సంస్థల పథాధికారుల సమన్వయ సమావేశాలు ఈరోజుతో ముగిశాయి.ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు భాగ్యనగర్(హైదరాబాద్) శివారు అన్నోజీ గూడలో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబళేతో పాటు అయిదుగురు సహాసర్ కార్యవాహలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ హాజరయ్యారు. ఈ సమావేశాల అనంతరం జాతీయ సహా ప్రధాన కార్యదర్శి, డా. మన్మోహన్ వైదయ్ మాట్లాడుతూ.. సమావేశాల్లో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. సమావేశాల్లో 36 సంస్థలకు చెందిన 216 మంది పాల్గొన్నారన్నారు. ఈ సమావేశాలు ప్రతీ ఏడాది సెప్టెంబర్, జనవరి నెలల్లో జరుగుతాయన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న స్వయం సేవక్లు తమ అనుభవాలు, భవిష్యత్ కార్యక్రమాలను ఇతరులతో పంచుకున్నారని తెలిపారు. ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోలేదన్నారు.
Read Also:దొంగ నాటకాలాడే బీజేపీని నమ్మొద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి
గతేడాది ఆరోగ్య రంగానికి సంబంధించిన పోషకాహార లోపాన్నిఅధిగమించడానికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించామన్నారు. ఆర్థిక రంగంలో ఉపాధి కల్పన పై కొన్ని సంస్థలు దృష్టి సారించాయని తెలిపారు. ఈ సమావేశంలో భారత కేంద్రికృత విద్యపై ఎక్కువ చర్చ జరిగిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం భారతీయ చరిత్ర ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఉండాలని, ఒకే విద్యావిధానం అనేది రాష్ట్రాల భిన్నత్వానికి ఏమాత్రం ఆటంకం కలిగించదని తెలిపారు. వైవిధ్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతః సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానం ఉంటుందన్నారు. మరుగున పడిన 250 మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలికి తీశామన్నారు. ఇందులో వివిధ వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీలున్నారన్నారు. వీర చరిత్రను సంస్కార భారతి నాటకాల రూపంలో ప్రచారం చేశామన్నారు. సేవా సంస్థలు దేశంలోని ఆరువేల బ్లాక్ మండల్లో 10 లక్షలకు పైగా కార్యకర్తలకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు శిక్షణను ఇచ్చినట్టు తెలిపారు.
Read Also: ఏపీలో కొత్తగా 840 కరోనా కేసులు
కోవిడ్ మూలంగా శాఖ కార్యక్రమాలు తాత్కాలికంగా ఆగినప్పటికీ పూర్తి స్థాయిలోతిరిగి పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతలో సంఘ కార్యక్రమాలపై ఆసక్తి పెరిగిందన్నారు. 2017-21 మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం లక్షకుపైగా యువత సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 వేల శాఖలు ఉన్నాయని, వాటి హాజరయ్యే వారిలో 60శాతం విద్యార్థులు 40 శాతం ఉద్యోగులు ఉన్నారన్నారు. కుల వివక్షతను రూపుమాపి సమాజంలో సద్భావనను పెంపొందించడానికి సామాజిక సామరస్యతక సంస్థ కృషి చేస్తోందన్నారు. సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన కార్యమని, జాగృత సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చేస్తుందని మన్మోహన్ వైదయ్ పేర్కొన్నారు.