తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ సంచలన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు , ప్రభుత్వంపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే విచారణకు రావాలని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి తమ్ముడు చేసినట్లుగా భావిస్తున్న అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు తాను సిద్ధమని, ఒకవేళ అది వద్దనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు రావాలని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు.
Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాము గుర్తించిన సుమారు 20 రకాల భారీ కుంభకోణాల జాబితాను సిద్ధం చేసి, వాటిపై విచారణ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను ముఖ్యమంత్రికి పంపినట్లు హరీష్ రావు వెల్లడించారు. ఈ జాబితాలో ప్రధానంగా అమృత్ టెండర్ల కుంభకోణం, సివిల్ సప్లైస్ స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, ఫోర్త్ సిటీ , యంగ్ ఇండియా స్కూల్ స్కామ్లను ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు సింగరేణి ఓబీ టెండర్లు, నైనీ కోల్ బ్లాక్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్ , ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రూవరీస్, కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలను కూడా హరీష్ రావు ఎండగట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎంతో పారదర్శకంగా ఉన్నానని గతంలో అసెంబ్లీలో చెప్పిన మాటలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ముఖ్యమంత్రి గారు.. మీరు నిజంగా సత్యహరిశ్చంద్రుడైతే, ఏ తప్పూ చేయకపోతే, మీలో చీము నెత్తురు ఉంటే మీరు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఈ 20 స్కామ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి” అని ఘాటుగా విమర్శించారు. ఒకవేళ సిఐడి (CID) విచారణపై నమ్మకం లేకపోతే, నేరుగా సిట్టింగ్ జడ్జి సమక్షంలోనే విచారణకు వెళ్దామని, నిజాయితీ ఉంటే భయపడాల్సిన అవసరం లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నామని, తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని ఆయన పునరుద్ఘాటించారు.