హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఒక భారీ చీటింగ్ , మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కొరడా ఝళిపించింది. ఎం/ఎస్ వివేకానంద్ బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయాధికారులు , బిల్డర్లు కుమ్మక్కై చేసిన అక్రమాలపై సుదీర్ఘ విచారణ జరిపిన అధికారులు, తాజాగా రూ.16.35 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ జప్తు చేసిన ఆస్తులలో ప్రధానంగా ఎంఎస్ ట్రిభా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పి. గోవర్ధన్ రెడ్డి , సొసైటీ అధ్యక్షుడు డి. శ్రీనివాసరావు పేర్లతో ఉన్న విలువైన బహిరంగ భూములు (Open Lands) ఉన్నాయి.
ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడానికి పునాది సైబరాబాద్లోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్లు. ముత్తంగి గ్రామంలోని హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్లు ఇస్తామని నమ్మించి, తీరా నిధులు వసూలు చేశాక తమకు అన్యాయం జరిగిందని సొసైటీ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (చీటింగ్), 120-బి (నేరపూరిత కుట్ర)తో పాటు తెలంగాణ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం జూలై 1, 2025న పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, ఇందులో భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో తన విచారణను వేగవంతం చేసింది.
U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్కప్ విజేతల జాబితా.. భారత్ ఆధిపత్యం మామూలుగా లేదుగా!
ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సుమారు 316 మంది సభ్యుల నుండి నివాస స్థలాల కేటాయింపు , ఇళ్ల నిర్మాణం పేరుతో పాలకవర్గం దాదాపు రూ.18.09 కోట్లను వసూలు చేసింది. అయితే, ఈ నిధులను వాగ్దానం చేసినట్లుగా హౌసింగ్ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయకుండా, సొసైటీ అధ్యక్షుడు, ఖజాంచి , డైరెక్టర్లు అంతా కలిసి బిల్డర్ పి. గోవర్ధన్ రెడ్డితో కుమ్మక్కయ్యారు. సొసైటీ బ్యాంక్ ఖాతాల నుండి బిల్డర్ వ్యక్తిగత ఖాతాలకు , ఇతర ప్రైవేట్ సంస్థలకు భారీ మొత్తంలో నిధులను అక్రమంగా బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. స్వీయ చెక్కుల ద్వారా నగదును విత్డ్రా చేయడం, మూడవ పక్ష సంస్థల ద్వారా నిధులను మళ్లించడం వంటి పద్ధతులను వీరు అనుసరించారు. మరీ ముఖ్యంగా, సభ్యుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను సొసైటీ పేరు మీద రిజిస్టర్ చేయకుండా, వ్యక్తిగత లాభం కోసం బిల్డర్ , అధ్యక్షుడి సొంత పేర్ల మీద అక్రమంగా బదలాయించుకున్నారు.
ఈ మొత్తం దర్యాప్తులో సుమారు రూ.17.31 కోట్ల మేర అక్రమ ఆదాయం (Proceeds of Crime) ఉత్పన్నమైనట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. నేరం ద్వారా పొందిన ఈ నిధులతోనే నిందితులు విలాసవంతమైన ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రూ.16.35 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. ఈ కేసులో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా, నిధులు ఇంకా ఎక్కడెక్కడికి మళ్లాయి అనే అంశాలపై ఈడీ లోతైన దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ చర్యతో హైదరాబాద్లోని ఇతర కోఆపరేటివ్ సొసైటీల నిర్వాహకుల్లోనూ చర్చ మొదలైంది.
IND Playing XI vs USA: అమెరికాతో మ్యాచ్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!