ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్దేవ్పల్లి, ఎస్ఆర్నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు.
అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియల అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే మరుసటి రోజు మరొక కుటుంబం మార్చురీకి చేరుకుంది. రెండవ గుర్తు తెలియని మృతదేహం తమ బంధువు కాదని తెలపడంతో అధికారులు అప్రమత్తయ్యారు.
విచారించగా మొదటి కుటుంబం తప్పుగా మృతదేహాన్ని గుర్తించినట్లు మార్చురీ అధికారులు నిర్థారణకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన వారు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు.
“ఓజీహెచ్ మార్చురీలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తి సోదరుడు పొరపాటున ఒక మృతదేహాన్ని గుర్తించి మార్చురీ నుండి తీసుకువెళ్లాడు. తరువాత మరొక కుటుంబం వచ్చి తమకు చెందిన మృతదేహం గురించి తెలపడంతో మార్చురీ అధికారులు వెంటనే మొదటి కుటుంబాన్ని అప్రమత్తం చేశారు. తరువాత మేము రెండు మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేశాము ”అని ఓజీహెచ్ సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు.