కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12 గ్రూపులకు వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కిరాణా షాపులు, వీధి షాపులు, సెలూన్లు తదితర వాటిని హైఎక్స్ పోజర్ కేటగిరిలో చేర్చారు. ఈ కేటగిరిలో ఉన్న వారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఓ యాప్ను సిద్దం చేస్తున్నది. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.