ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్కి చేరుకోనున్నారు.
11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ ప్రధాని దేవగౌడతో చర్చించనున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు దేవగౌడతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఇక మధ్యాహ్నం 3.45కి దెవగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. 4 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 5.10కి ప్రగతి భవన్కి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.
ఇటీవలే.. ఢిల్లీ, పంజాబ్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోనూ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తోనూ..పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోనూ భేటీ అయ్యారు. అయితే ఢిల్లీ పర్యటనను రెండు రోజుల ముందే ముగించుకున్న సీఎం కేసీఆర్..ఉన్నట్టుండి సోమవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కర్ణాటక పర్యటనను ఖరారు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఇతర అంశాలపైనా నేతలు చర్చించనున్నారు. ఈక్రమంలో సీఎం భద్రతా సిబ్బంది ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.
కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా నగరంలో పలు చోట్ల అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన అనంతరం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిసేందుకు మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారని ముందుగా భావించినా..ఆ పర్యటన ఖరారు కాలేదు. దీంతో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
అయితే.. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ..హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండేందుకే బెంగళూరు వెళ్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన గతకొద్దిరోజుల క్రితమే నిర్ధారణ అయింది. మోదీ పర్యటనలో పాల్గొనడం ఇష్టంలేకనే సీఎం కేసీఆర్ దేశంలో పలు రాష్ట్రాల పర్యటనను పెట్టుకున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది.ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు.
అయితే గత రెండుసార్లు ప్రధాని పర్యటనల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. తాజాగా 26న ప్రధాని పర్యటనలోనూ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. దీంతో ముచ్చటగా మూడోసారి తెలంగాణలో ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నట్లు అవుతుంది. 2020 నవంబర్ 28న ప్రధాని హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదని అప్పట్లో టీఆర్ఎస్ వివరణ ఇచ్చింది.