బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఎత్తు బంగారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆయన వెంట స్థానిక బీజపీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కల్లాల వద్ద ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. దళిత బంధుతో దగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకుని రాష్ర్ట ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. జాతర సమయం దగ్గర పడుతున్న జాతర పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కేసీఆర్కు గిరిజనులన్నా, గిరిజన దేవతలన్నా చిన్నచూపు ఉందన్నారు. శాశ్వత నిర్మాణాకు ప్రణాళికలు రచించకుండా తాత్కాలిక నిర్మాణాలపేరుతో ప్రభుత్వం, కాంట్రాక్టర్ల జేబులు నింపుకుంటుంన్నారని ఆయన అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవరిస్తుందని దీనితో ప్రతి జాతరలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఈటల రాజేందర్అన్నారు. ఇప్పటికైనా వనదేవతల జాతరను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.