ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఆర్టీసీ బస్సులే దిక్కు అని చెప్పారు. మూడేళ్లలో ఐదు సార్లు ఛార్జీలు పెంచారని ఆయన విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని.. ఆ కుట్రలో భాగమే ఛార్జీల పెంపు అని సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు కూడా ఇంకా చెల్లించలేదని ఆయన విమర్శించారు. తొలుత జేబీఎస్ వద్దకు బండి సంజయ్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకుని గృహనిర్బంధం చేశారు. ఆతర్వాత పోలీస్ ఎస్కార్ట్ లో సంజయ్ జేబీఎస్ కు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు.