హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి పీపీఈ కిట్స్ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలన్నారు.
కాలేజీ ఆవరణంలో మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేశామని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొన్నారు. విజయం సాధించిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే వచ్చి గెలుపు ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సిందిగా ఆయన వెల్లడించారు. వీవీప్యాట్ వీడియో వైరల్ అవ్వడంతో దానిపై స్పందించిన శశాంక్ గోయల్ వివరణ ఇస్తూ వీవీ ప్యాట్ వీడియో పై పూర్తి విచారణ చేశామని, అది ఎన్నికతో సంబంధం లేని వీవీప్యాట్ అని చెప్పారు.