ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సుమారు 1800 మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80 వేల మంది ఉద్యోగుల్లో సుమారు ఒక శాతం మందిపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం అనంతరం మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుంది. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ సహా పలు గ్రూపులలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఈ తొలగింపులు చేపట్టింది.
Read Also: Srilanka Crisis: శ్రీలంకకు వెళ్లాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్
అమెరికాలో జులై 4 సెలవులు తరువాత ఉద్యోగులను తొలగించడం మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని సదరు కంపెనీ వివరించింది.ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపులు ఉన్నప్పటికీ.. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, రాబోయే సంవత్సరంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాలని యోచిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అటు ఈ ఏడాది ఉద్యోగ నియామకాలను తగ్గించినట్టు ఇటీవల గూగుల్ ప్రకటించింది. కంపెనీ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో విఫలమైన మెటా ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనున్నట్టు ప్రకటించిన కొన్నిరోజుల అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు మెమోలను పంపారు.