తెలంగాణలో రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ సంతోషం చూస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సంపూర్ణం అయిందని ఆయన పేర్కొన్నారు. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయని తెలిపారు.
మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ.. తెలంగాణను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ కేన్సర్ లాంటోడు... మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు అని విమర్శించాడు.
స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు.