తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.
తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోస్ చేసింది.
నేడు గాంధీభవన్లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్సభ నియో జకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది.