కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.2,747 కోట్లు విడుదల చేసింది. మహబూబ్నగర్లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆధార్ , రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అవినీతి నిరోధక శాఖకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నికేష్కు చెందిన 33 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గురించినట్లు సమాచారం.
హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
ఇటీవల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ సస్పెండ్ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు.
TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం (నవంబర్ 30) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.