ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందన్నారు. చంద్రబాబు స్లీపర్ సెల్స్ చచ్చిపోతూ వస్తున్నాయని.. ఇవాళ అడ్డగోలుగా దొరికారని ఆయన వ్యాఖ్యానించారు.
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు.
ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుందని ఆయన విమర్శించారు.
టీడీపీ నేతలు సభకు చర్చకోసం కాదు.. రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ నేత బాలకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు.
వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.