ఆంధ్రప్రదేశ్లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
పవన్ కల్యాణ్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
రాజ్ భవన్ లో ఎన్డీయే కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు గవర్నుకు లేఖ అందించారు.