Off The Record: రైతుల అవసరాలు తీర్చడంతో పాటు వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో ఆ ఒక్క పని తప్ప మిగతా అన్నీ జరిగిపోతున్నాయట. రకరకాల రుణాల పేరుతో భారీ ఎత్తున మోసాలు జరుగుతూ.. అవినీతి, ఆర్థిక అరాచకాలకు కేరాఫ్గా మారిందని అంటున్నారు. నకిలీ రైతులు, డ్వాక్రా సంఘాల పేరుతో అడ్డసుడి రుణాలు, కోల్డ్ స్టోరేజీలలో పంట నిల్వల పేరుతో గోల్మాల్ లోన్లు… ఇలా ఒకటేంటి… అవినీతికి అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో దండుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చాలా బ్రాంచ్ల్లో ఇలాంటి మోసాలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం 30కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు తేల్చింది. దీనికి సంబంధించి నల్లపాడు పోలీసులు కేసు బుక్ చేశారు కూడా. కుంభకోణం జరిగినప్పుడు ఉన్న జీడీసీసీబ్యాంక్ సీఈఓ కృష్ణవేణి, ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులుతోపాటు కొంతమంది పాలకవర్గం సభ్యుల్ని ఇందుకు బాధ్యులుగా చేస్తూ మొత్తం 13మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అలాగే అప్పటి నల్లపాడు బ్రాంచ్ మేనేజర్ అరుణకుమారి, బ్యాంక్ సెంట్రల్ కమిటీ మెంబర్ గోవిందనాయక్ను అరెస్ట్ చేశారు. తర్వాత మిర్చినిల్వల పేరుతో రుణాలు తీసుకున్న కోల్డ్ స్టోరేజీ ఎండీ శివనాగిరెడ్డి, మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, మిర్చి వ్యాపారి రామచంద్రరావు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే… కేసు నమోదైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళారు అప్పుడు ఛైర్మన్గా ఉన్న రాతంశెట్టి సీతారామాంజనేయులు. నెలలు గడుస్తున్నా… ఇంతవరకు ఆయన ఆచూకీ లేదు. దీంతో విమర్శలు పెరుగుతున్నాయి. సీతారామాంజనేయులుని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే…. మొత్తం వివారలన్నీ బయటికి వచ్చేస్తాయని, ఆ పని మాత్రం జరగడం లేదన్న చర్చలు నడుస్తున్నాయి గుంటూరు పొలిటికల్ సర్కిల్స్లో. అయితే… కేసు నమోదైందన్న సంగతి తెలిసిన వెంటనే… సీతారామాంజనేయులు దేశం దాటేశారన్న ప్రచారం కూడా ఉంది. ఆయన దేశంలోనే అజ్ఞాతంలో గడుపుతున్నారా? లేక ఇక్కడ జనం సొమ్ము దోచేసి విదేశాల్లో విహరిస్తున్నారా అన్నది తేల్చాల్సిన పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి చాలామందికి. సరే… పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద వత్తిళ్ళు ఉన్నాయా? లేక స్వేచ్ఛగా నిందితుడి కోసం గాలిస్తున్నారా లాంటి కొన్ని ప్రశ్నల్ని అలా ఉంచితే…. అసలు కథ మాత్రం సరిగ్గా సీతారామాంజనేయులు అజ్ఞాతంలోకి వెళ్ళిన దగ్గర్నుంచి మొదలైంది. ఆయన పారిపోవడానికి కొందరు టీడీపీ నాయకులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తు మొదలవగానే… కొందరు అధికార పార్టీ నాయకులు సదరు మాజీ ఛైర్మన్కు టచ్లోకి వెళ్ళారట. ఈ కేసు గురించి ప్రస్తావిస్తూ…. డోంట్ వర్రీ…. నీ సంగతి మేం చూసుకుంటాం, కేసులు గీసుల సంగతి మర్చిపో…. మమ్మల్ని మాత్రం గుర్తుంచుకో అంటూ బేరాలకు దిగినట్టు తెలిసింది.
ఒక నియోజకవర్గ స్థాయిలో మంచి పొజిషన్ ఉన్న నాయకుడొకరైతే…. మొత్తం నేను చూసుకుంటా….. అయితే నాకేంటి, అమౌంట్ ఎంతో చెప్పాలంటూ మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపినట్టు సమాచారం. జీడీసీసీ లాంటి బ్యాంక్ లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే… సూత్రధారులు ఎవరు? అసలు డబ్బులు ఎక్కడకు చేరాయన్న విషయం మీద దృష్టి పెడతారు. కీలకంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే గుట్టు మొత్తం రట్టవుతుంది. కానీ.. ఈ కేసులో మాత్రం చిన్న చిన్నవారిని అరెస్ట్ చేసి కీలకమైన వాళ్ళను వదిలేశారన్న విమర్శలు సైతం ఉన్నాయి. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల పేరుతో 30కోట్ల రూపాయలు కాజేసిన వాళ్ళు ఎవరో తేల్చడం పెద్ద విషయం కాదని, అయినాసరే… పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి కేసు మొత్తం చిన్న చేపల చుట్టూ తిరగడం ఏంటో అర్ధం కావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. ఇదే సమయంలో మంచి ఆఫర్ ఇస్తే….ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని టీడీపీకి చెందిన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడొకరు బేరాలు పెట్టారన్న ప్రచారంతో తెర వెనక ఏదేదో జరిగిపోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే… ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నీకెందుకు… అంతా నేను చూసుకుంటానని సదరు నేత ఆఫర్ ఇస్తున్నా…. ఆయన ఎంతవరకు చూడగలరు? ఆయన సత్తా ఏంటన్న అనుమానం సీతారామాంజనేయులుకు ఉందని, అందుకే డీల్ డిలే అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ… మధ్యవర్తులు మాత్రం ఎక్కువకాలం సాగతీయకుండావీలైనంత త్వరగా బేరం కుదిర్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ డీల్ సెట్ అయితే….పక్కదారి పట్టిన కోట్ల రూపాయల కేసులో అసలు దోషులు ఎవరో తేలకుండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ స్కామ్ దర్యాప్తులో తదుపరి అడుగులు ఎలా పడతాయో చూడాలి.