Chandrababu Meet Amit Shah: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికి ఏ పదవులు అనే దానిపై కూడా కసరత్తు చేశారు.. అయితే, దీనికి కూటమి పార్టీలోని అగ్రనేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది.. రేపు ప్రమాణస్వీకారం ఉండగా.. ఈ రోజు రాత్రికే విజయవాడ చేరుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వారికి గన్నవరం ఎయిర్పోర్ట్లో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు అమిత్షా, జేపీ నడ్డా.. టీడీపీ అధినేతతో కేబినెట్ కూర్పుపై చర్చ జరుగుతోంది..
Read Also: World Bank: భారత్ ఆర్థిక వ్యవస్థ బుల్లెట్ వేగంతో వృద్ధి చెందుతుంది.. ప్రపంచ బ్యాంకు వెల్లడి
ఏపీ కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరెవర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు-అమిత్షా, నడ్డా మధ్య చర్చ సాగుతోంది.. ఇక, బీజేపీ విషయంలో క్లారిటీ వచ్చాకే.. మంత్రివర్గంపై చంద్రబాబు ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.. ఇవాళ అర్థరాత్రి తర్వాతే గవర్నర్కు మంత్రుల జాబితాను చంద్రబాబు నాయుడు పంపిస్తారని చెబుతున్నారు.. అమిత్ షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి చంద్రబాబు ఫోన్లు చేయనున్నారట.. అయితే, ఇప్పటికే విజయవాడ, గుంటూరులో తమ ఫ్యామిలీలతో సహా దిగిపోయారు ఆశావహులు. చంద్రబాబు నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. రేపే ప్రమాణస్వీకారం ఉండడంతో.. తగిన ఏర్పాట్లతో అధినేత ఫోన్ కోసం వేచిఉన్నారట.. మరి.. అమిత్షా-చంద్రబాబు భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? బీజేపీకి ఎన్ని పదవులు దక్కనున్నాయి…? ఏ శాఖలు కేటాయిస్తారు..? జనసేన అధినేత పవన్ కల్యాణ్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నారా? జనసేనకు దక్కే మంత్రి పదవులు ఎన్ని..? టీడీపీలో ఏ నేతను మంత్రి పదవి వరించనుంది.. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది? అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారిపోయింది.