Rohit Sharma React on off-spin bowling in T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టు ప్రకటన రెండు రోజుల అనంతరం గురువారం (మే 2) కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వారు వివరణ ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడనే విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నేనున్నానంటూ రోహిత్ శర్మ తన చేతెత్తాడు. తానే జట్టులో ఆఫ్ స్పిన్నర్ అని రోహిత్ చెప్పకనే చెప్పాడు. ‘మేము జట్టు గురించి చాలా ఆలోచించాం. ఆఫ్ స్పిన్నర్ జట్టులో ఉండాలా? వద్దా? అని చర్చించుకున్నాం. వాషింగ్టన్ సుందర్ ఇటీవల పెద్దగా క్రికెట్ ఆడలేదు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ గురించి చర్చ జరిగింది. అయితే జట్టులో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండాలనుకున్నాం. ఇటీవల అశ్విన్ పెద్దగా టీ20లు ఆడలేదు. అక్షర్ 50 ఓవర్ల ఫార్మాట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ మాకు మాకు పనికొస్తుంది. అంతేకాదు అక్షర్ చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Also Read: Rohit Sharma: నలుగురు స్పిన్నర్లు ఎందుకన్నది చెప్పను: రోహిత్ శర్మ
కెరీర్ ప్రారంభంలో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్గా రోహిత్ శర్మ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్లో హిట్మ్యాన్ సత్తా చాటాడు. తన బ్యాటింగ్, బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్, భారత జట్టుకు బౌలింగ్ చేశాడు. అయితే మెడికల్ టీమ్ సూచనల మేరకు బౌలింగ్ చేయడం మానేశాడు. అయితే కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్.. టీ20 ప్రపంచకప్ 2024లో అవసరమైతే ఆఫ్ స్పిన్నర్గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాడు.