Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు ఎంపిక అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతోనే హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి తీసుకున్నామని ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ ప్రకటన సందర్భంగా మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వడం రోహిత్ శర్మతో పాటు జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఇష్టం లేదట. అందుకే ముంబై టీమ్ రెండు గ్రూప్లుగా విడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మైదానంలోనూ రోహిత్, హార్దిక్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమైంది.
Also Read: Tabu-Dune Prophecy: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ‘టబు’!
మరోవైపు ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్గా మాత్రమే కాకుండా.. ఆల్రౌండర్గా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 200 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 11 వికెట్స్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచకప్ 2024కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చొయొద్దని రోహిత్ శర్మ సూచించాడట. కానీ హెడ్ కోచ్ ఇవేమీ పట్టించుకోలేదట. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు కూడా సదరు జాతీయ వెబ్సైట్ పేర్కొంది. కెప్టెన్గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే హార్దిక్ను వైస్ కెప్టెన్గా ప్రకటించినట్లు వెల్లడించింది.