Suryakumar Yadav Counter to Mitchell Santner Before T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాటల యుద్ధం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా స్పందించాడు. తాము మైదానంలో జనాలను నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం అని సాంట్నర్ అనగా.. ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా అంటూ సూరీడు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ నేపథ్యంలో ఇరు ఇరు జట్ల కెప్టెన్స్ సూర్యకుమార్ యాదవ్, మిచెల్ సాంట్నర్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సాంట్నర్ మాట్లాడుతూ… ‘మేం ఫేవరెట్స్ కాదని అందరూ అనుకున్నపుడు వెళ్లి ఆడడం సవాలే కానీ.. దాన్ని పట్టించుకోం. సొంతగడ్డ కాబట్టి టీమిండియాకు మద్దుతు ఉంటుంది. మేం నరేంద్ర మోడీ స్టేడియంలోని జనాలు నిశ్శబ్దం వహించేలా చేయాలనుకుంటున్నాం. ఈసారి ట్రోఫీ గెలవడానికి కొన్ని హృదయాలను బద్దలుగొట్టడానికైనా నేను సిద్ధమే’ అని వ్యాఖ్యానించాడు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలనే తన జట్టు పట్టుదలను సాంట్నర్ ఈ వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ముంగిట ఆసీస్ కెప్టెన్ కమిన్స్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.
మిచెల్ సాంట్నర్ వ్యాఖ్యలపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్… ‘భారత్కు వచ్చిన ప్రతి కెప్టెన్ అదే లైన్ను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి’ అని నవ్వుతూ స్పందించాడు. సూర్య చెప్పిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న జర్నలిస్టుల్లోనూ నవ్వులు పూయించాయి. ‘మా జట్టులో అందరూ చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. సంజు శాంసన్ తుది జట్టులోకి తీసుకు రావడం టోర్నీలో కీలక మలుపు. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి’ అని సూర్య చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ ముందు ఇలాంటి సరదా వ్యాఖ్యలు మ్యాచ్పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత పోరును అందించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.