క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా? అంటూ వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ ఏర్పడింది. కరోనా టైంలోనూ బీసీసీఐ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఐపీఎల్-2021ను నిర్వహించి విజయవంతం చేసింది. ప్రతీ ఎడిషన్ లోనూ సరికొత్త ఐడియాలతో ఐపీఎల్ నిర్వహకులు క్రికెట్ మ్యాచులను ప్లాన్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు వీక్షకుల సంఖ్య పెరిగిపోతూ పోతోంది. దీంతో ఐపీఎల్ జట్లను దక్కించుకున్న యజమానులకు కాసులవర్షం కురుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఎనిమిది జట్లు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరం నుంచి జరిగే 15వ ఎడిషన్ నుంచి మరో రెండు జట్లు అదనంగా రానున్నాయి. మొత్తం 10జట్లతో ఐపీఎల్-2022ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగా రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 25 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. వీరిలో నాలుగు సంస్థల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
ప్రముఖ వ్యాపార దిగ్గజలైన అదానీ గ్రూప్, ఆర్పీ సంజయ్ గోయాంకలు బిడ్లను దాఖలు చేశారు. అలాగే ఇంగ్లీష్ ఫుల్ బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ సైతం ఐపీఎల్ కొత్త టీంపై కన్నేసింది. ఈమేరకు ఈ సంస్థ కూడా బిడ్ ను దాఖలు చేసింది. వీరితోపాటు ప్రముఖ బాలీవుడ్ కపుల్స్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ లు ఐపీఎల్ టీం కోసం బిడ్లను దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది. దీపిక-రణ్వీర్ లకు క్రీడలు కొత్తమే కాదు. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకోన్ మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో సహజంగానే ఆమె సైతం క్రీడలపై మక్కువ పెంచుకుంది.
ఇండియాలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో సినిమాలకు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండింటిని ఐపీఎల్ కలిపిందనే చెప్పొచ్చు. ఐపీఎల్ ప్రతీ సీజన్లోనూ బాలీవుడ్ స్టార్స్ సందడి కన్పిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ ప్రీతీజింటాలు రెండు ఐపీఎల్ టీంలకు ఓనర్లుగా ఉన్నారు. తాజాగా దీపిక పదుకోన్, రణ్వీర్ జంట కూడా ఐపీఎల్ టీంను దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండటం సినీ, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంట సైతం ఐపీఎల్ టీమును దక్కించుకుంటే ఈసారి టోర్ని మరింత కలర్ ఫుల్ గా సాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ వీళ్లు ఐపీల్ టీంను దక్కంచుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!