ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (92: 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పాటిదార్ (55: 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (46: 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇనింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, విధ్వత్ కవెరప్ప 2 వికెట్స్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకి ఆదిలోనే పంజాబ్ అరంగేట్ర పేసర్ విధ్వత్ కవెరప్ప షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (9)ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో హిట్టర్ విల్ జాక్స్ (12)ను వెనక్కి పంపాడు. దాంతో 43 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ అండతో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ధాటిగా ఆడుతున్న అతడు బెయర్స్టోకు దొరికాడు. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది.
Also Read: SIT Trailer: సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ ట్రైలర్ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్!
పదో ఓవర్ తర్వాత కోహ్లీ రెచ్చిపోయాడు. సామ్ కరన్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చహర్ ఓవర్లో భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఆ తర్వాత గేర్ మార్చి.. ఎడాపెడా బౌండరీలు బాదాడు. కామెరూన్ గ్రీన్ సైతం ధాటిగా ఆడడంతో పరుగుల వరద పారింది. సెంచరీకి చేరువైన కోహ్లీ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. దినేశ్ కార్తిక్ (18) బాదేశాడు. అయితే ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి బెంగళూరు స్కోర్ 250 దాటకుండా చూశాడు.