Hockey Worldcup: హాకీ ప్రపంచకప్లో టీమిండియా శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా శుక్రవారం స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ను భారత్ తొలుత నెమ్మదిగా ఆరంభించింది. ఆ తర్వాత ప్రత్యర్థి గోల్పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది. అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు.
Read Also: Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?
ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్కు తగిలి గోల్పోస్టులోకి వెళ్లడంతో భారత్ ఆధిక్యం 2-0కి పెరిగింది. మూడో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంలో భారత్ విఫలమైంది. మరోవైపు గోల్స్ కోసం స్పెయిన్ తీవ్రంగా పోరాడినా భారత డిఫెన్స్ ఆటగాళ్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి 7 నిమిషాల్లో స్పెయిన్కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ భారత డిఫెన్స్ ఆటగాళ్లు విజయవంతంగా అడ్డుకోగలిగారు. దీంతో స్పెయిన్ ఖాతా తెరవలేకపోయింది. భువనేశ్వర్లో జరిగిన పూల్-ఎ మ్యాచ్లో ఫ్రాన్స్పై ఆస్ట్రేలియా 8-0తో ఘన విజయం సాధించగా రూర్కెలాలో జరిగిన పూల్-డి మ్యాచ్లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న వేల్స్పై 5-0 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.