Virender Sehwag Said India should fear West Indies in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో మ్యాచ్ను అస్సలు లైట్ తీసుకోవద్దని, కరేబియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని సూచించాడు. అలానే విండీస్ జట్టులో ఒక్కడు నిలబడ్డా.. మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. కరేబియన్లు బాదే సిక్సర్లకు భారత బౌలర్ల ప్యాంట్లు తడవడం ఖాయం అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వీరూ గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
భారత్-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘2016లో భారత్కు వెస్టిండీస్ వచ్చింది. కరేబియన్లు వరల్డ్ కప్ గెలిచిన సందర్భం నాకు గుర్తుంది. ముఖ్యంగా కార్లోస్ బ్రాత్వైట్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వరుసగా నాలుగు సిక్సులు కొట్టిన దృశ్యం నేను ప్రత్యక్షంగా కామెంటరీ చేస్తూ చూసాను. ఆ ఇన్నింగ్స్ నన్నే ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రత్యేకత ఏంటంటే.. హిట్టింగ్ సామర్థ్యమే. విండీస్ జట్టులో దాదాపు ప్రతి ఆటగాడూ భారీ షాట్లు ఆడగలడు. అందుకే వారిని ఎదుర్కొనేప్పుడు భయం ఉండాల్సిందే. టీ20 ప్రపంచకప్ 2026లో ఇంకా బాగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వారిని ఎదుర్కోవాలంటే టీమిండియాకు పూర్తి స్థాయి ప్రణాళిక అవసరం. ప్రత్యేక ప్రణాళిక ప్రకారమే వారిని కట్టడి చేయాలి’ అని చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్లో ఈరోజు వెస్టిండీస్ను భారత్ ఢీకొట్టనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ ఘన విజయంతో.. సెమీ ఫైనల్ రేసులోకి వచ్చిన టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మెగా టోర్నీలో రెండు జట్లు ఒక్క ఓటమే చవిచూశాయి. రెండు జట్ల బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్ మార్చి 5న ముంబైలో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఢీకొంటుంది. వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలతో అభిమానులు భారత్–వెస్టిండీస్ పోరు కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్లో ఏ జట్టు ఆధిపత్యం చాటుతుందో చూడాలి.