T20 World Cup: భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ వివాదంపై మాజీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సీఈఓ సయ్యద్ అష్రఫుల్ హక్ సంచలన వ్యాక్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉచ్చులో పడినట్లు ఆయన చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడం కోసం ఉచ్చులో పడ్డాడు’’ అని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చైర్మన్ మోహ్సీన్ నఖ్వీ, అమీనుల్ ఇస్లాంను తప్పు దారి పట్టించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ రెచ్చగొట్ట ఉండొచ్చని అన్నారు.
Read Also: Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
పాక్ ప్రభావితం చేయడం వల్లే బంగ్లాదేశ్ ప్లేయర్లు కీలకమైన టోర్నీని ఆడకుండా ఉన్నారని హక్ చెప్పారు. లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నజ్ముల్ శాంటో వంటి ఆటగాళ్లు 30 ఏళ్లలో ఉన్నారు, ఈ ప్రపంచ కప్లో ఆడకపోవడం బంగ్లా క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. భారత్ తర్వాత, క్రికెట్ ను పిచ్చిగా ఆరాధించే దేశాల్లో బంగ్లాదేశ్ ఉంటుందని, ఇలాంటి టోర్నీ నుంచి బయటకు రావడం అభిమానుల్ని, ప్లేయర్లను నిరాశకు గురిచేసి ఉంటుందని చెప్పారు.
భారత్లో ఆడటానికి ఎలాంటి భద్రత సమస్యలు లేవని, ఐసీసీ సరైన భద్రత ఇచ్చదేని, కావాలంటే బంగ్లాదేశ్ సెక్యూరిటీ విషయంలో అదనపు హామీలు అడగాల్సిందని ఆయన అన్నారు. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారమయ్యేదని ఆయన చెప్పారు. ఇది అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఇమేజ్ను దెబ్బతీసిందని, ఇది దౌత్యపరంగా పెద్ద వైఫల్యమని ఆయన అన్నారు. అమీనుల్ ఇస్లాంకు అనుభవలేమి, ప్రభుత్వాన్ని సంతోషపెట్టడానికి, పీసీబీ ప్రభావంతో తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్కు పెద్ద నష్టం తెచ్చిందని చెప్పారు.