మాజీ మంత్రి రోజా మళ్ళీ పొలిటికల్గా చెలరేగిపోవడానికి సిద్ధమయ్యారా? గాడిదలు, అడ్డగాడిదలు, పాలు పితకడాల్లాంటి మాటలన్నీ అందులో భాగమేనా? అడపాదడపా మినహా ఇన్నాళ్ళు పెద్దగా రియాక్ట్ అవని ఎక్స్ మినిస్టర్ ఇప్పుడెందుకు నోరు తెరుస్తున్నారు? ఆ కేసులో గవర్నమెంట్ తనను టచ్ చేయబోదన్న క్లారిటీ వచ్చిందా? అదే నిజమైతే ఆమె భరోసా ఏంటి? ఎవరు కాపాడుతున్నారని తమ్ముళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు? రోజా మళ్ళీ నోటి బ్యాటింగ్ మొదలెట్టేసినట్టేనా? ఉగాది సెంట్రిక్గా చేసిన తాజా వ్యాఖ్యలు అందులో భాగమేనా…? అంటూ కూటమి వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి సర్కిల్స్లో అయితే… దీని గురించి సమ్మర్ హీట్ కంటే హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కూటమి ముఖ్య నాయకుల ఉగాది వేడుకలను ఉద్దేశించి రోజా మాట్లాడిన మాటల్ని విశ్లేషిస్తున్న పలువురు తిరిగి ఫామ్లోకి వచ్చేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో అడుదాం ఆంధ్రా కేసు తననేం చేయబోదన్న క్లారిటీ కూడా వచ్చిఉంటుందని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒకరిద్దరు ఆ దిశగా ఆమెకు భరోసా ఇచ్చి ఉంటారన్న ప్రచారం ఇంకా ఉత్కంఠ పెంచుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాన్నాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్నారు రోజా.
ఆ తర్వాత కూడా అడపాదడపా మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ… అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు పాత పద్ధతిలో పంచ్ డైలాగ్స్, రియాక్షన్స్ ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం వెనక బలమైన భరోసానే వచ్చి ఉండవచ్చన్నది పొలిటికల్ టాక్. కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైసీపీ లీడర్స్ వివిధ కేసుల్లో జైలుకు వెళ్ళారు, బెయిల్ మీద బయటికి వచ్చారు. హిట్ లిస్ట్ టాప్ ప్లేస్లో ఉన్న రోజా విషయంలో కూడా యాక్షన్ ఉంటుందని తమ్ముళ్ళు తెగ మాట్లాడేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం టీడీపీ నాయకులైతే…. ఇక నెక్స్ట్ ఆమే, నేడో రేపో అరెస్ట్ అన్నంత రేంజ్లో ప్రచారం చేసేశారు కూడా. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అదే ఆమెకు ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకున్నారు.
కట్చేస్తే… ఇప్పుడు చిత్తూరు తమ్ముళ్ళకు కొత్త చిత్రం కనిపిస్తోందట. రోజా మళ్ళీ వాయిస్ పెంచడం, అదీకూడా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ని ఉద్దేశించి నెగెటివ్ కామెంట్స్ చేయడం చూసి మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆమెదే పైచేయి అవుతుందా అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రా కేసులో యాక్షన్ ఉంటుందని ఆశిస్తున్న టైంలో… అలాంటిదేం లేకపోగా ఆమె మన పెద్దల్నే టార్గెట్ చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటూ వాళ్ళలో వాళ్లే డిస్కస్ చేసుకుంటున్నారట కూటమి కార్యకర్తలు. ఆడుదాం ఆంధ్రా కేసులో అరెస్ట్ అవుతుందంటూ పదుల సంఖ్యలో ప్రెస్ మీట్స్పెట్టి మరీ చెప్పిన శాప్ ఛైర్మన్, కేసు సంగతి 30 రోజుల్లో తేల్చేస్తామని అసెంబ్లీలో ఘనంగా చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏమయ్యారు? 30 రోజుల మాటలు రెండుళ్ళు కావస్తున్నా ఎందుకు అమలవడం లేదంటూ తమ పార్టీ నాయకుల మీదే రివర్స్ అవుతున్నారు టీడీపీ కార్యకర్తలు. అంటే….అది ఉత్తుత్తి కేసేనా? అందులో రోజా ప్రమేయం ఏమీ లేదా? అదే నిజమైతే… డైరెక్ట్గా ప్రకటించేస్తే పోతుంది కదా అంటూ…సీరియస్ కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదే విషయమై కాస్త లోతుల్లోకి వెళ్ళి, అమరావతి స్థాయిలో ఎంక్వైరీలు పెట్టిన తమ్ముళ్ళకు కొత్త సంగతులు తెలిసి విస్తుపోతున్నారట. కేసు నమోదైన కొత్తల్లో కాస్త కంగారు పడి సైలెంట్ అయిన రోజాకు ఆ తర్వాత తనకేమీ కాదన్న భరోసా వచ్చిందన్నది టీడీపీ వర్గాల్లోనే ఉన్న ఓ అభిప్రాయం. అందుకు గట్టి కారణాలనే చూపిస్తున్నారు వాళ్ళు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆమె నిర్వహించిన శాఖల్లో అత్యంత కీలకంగా పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు ప్రస్తుతం సీఎం ఆఫీస్లో ఉన్నారని, అందుకే విచారణ అటకెక్కిందని, ఆయన హవా నడిచినంతకాలం తనకేం కాదని రోజా భరోసాగా ఉన్నారన్నది చిత్తూరు తమ్ముళ్ళ మాట. ఆ విషయంలో పక్కా క్లారిటీతోనే…. ఆమె ఎవడ్రా మనల్ని ఆపేదంటూ మళ్ళీ నోరు తెరిచినట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీలోని కొందరు సీనియర్స్ దీన్ని కాస్త డిఫరెంట్గా విశ్లేషిస్తున్నారు. ఆమె ఎంత ఎక్కువగా అలాంటి మాటలు మాట్లాడితే ఆ పార్టీకే అంత నష్టమని, గత అనుభవం ఇదే చెబుతోందని విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా అది మనకు మేలేనన్నది వాళ్ళ మాట అట. అధికార పార్టీ లాభనష్టాల లెక్కలు ఎలా ఉన్నా…. అటు వైసీపీలో కూడా రోజా మళ్లీ పాత స్టైల్లో మాట్లాడితే కష్టమేనన్న చర్చ జరుగుతోందట.