కంటిన్యూ చేస్తారా? కటీఫ్ చెబుతారా? గడువు తరుముకొస్తోంది. పదవికి ముప్పు మంచుకొస్తోంది. కుర్చీల కింద బాంబులు పడుతున్న ఫీలింగ్. వాటిని ఎలా డిఫ్యూజ్ చేయాలో అర్ధంకాని కంగారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామందిలో ఇదే ఫీలింగ్ ఉందట. ఇంతకీ ఏ పదవుల విషయంలో వాళ్ళు అంతలా టెన్షన్ పడుతున్నారు? కొత్త పోస్ట్లు, ఎక్స్టెన్షన్ష కథేంటి? తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అందుకోసం అధికార పార్టీగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. జాబితా విషయంలో ఇప్పటికే ప్రాధమిక అవగాహన వచ్చినట్టు తెలిసింది. కానీ…. ఆశావహుల జాబితా చాలా పెద్దగా ఉండటం ఉత్కంఠను పెంచుతోంది. అదే సమయంలో ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న వాళ్ళ గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ పదవీకాలంకూడా దగ్గర పడుతోంది. దీంతో… వాళ్ళలో ఎంతమందికి ఎక్స్టెన్షన్ వస్తుంది? ఇంటికి వెళ్లేది ఎందరంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే కుర్చీల్లో కూర్చున్న వాళ్లకు కూడా టెన్షన్ పుడుతోందట. వచ్చే జూన్లో కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరగబోతోంది. అందుకు సంబంధించిన జాబితా కూడా…. ఖరారు కావస్తున్నట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తొలి విడతగా…. 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ ల పదవులను కట్టబెట్టింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు, పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్స్గా ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చి పదవులు కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పుడిక రెండేళ్లు దగ్గర పడుతూ ఆ పదవీకాలం పూర్తి కావస్తున్న క్రమంలో వాళ్ళంతా కుర్చీల కింద బాంబులు ఉన్నట్టు ఫీలవుతున్నారట. ఉన్న 37 మంది చైర్మన్లలో ఎంతమంది కంటిన్యూ అవుతారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అలాగే…ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లలో చాలామంది పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నారట. దాంతో… రెన్యువల్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ ఉండవచ్చని అంటున్నారు. వాళ్ళందరి పనితీరును గమనిస్తూ…. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు సీఎం. అయినాసరే…. చాలామంది ఆశించిన స్థాయిలో పనితీరును మెరుగుపరుచుకోలేదన్న అభిప్రాయం ఉందట.
కొన్ని కార్పొరేషన్లకు అవసరమైన నిధుల లేమి కూడా కొంత అడ్డంకిగా మారుతున్నట్టు తెలుస్తోంది. అలాగే…. ఎక్కువ మంది… పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వంపై వచ్చే విమర్శలు కావచ్చు… వేటికీ దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదన్న అసంతృప్తి ఉందట. దీంతో పనిచేయని వారిని కొనసాగించాలనే ఉద్దేశం సీఎంకు లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి గాంధీభవన్లో. ఇప్పుడు ఖాళీ అయ్యే 37ను భర్తీ చేయడంతోపాటు మరో 40 మందిని కొత్తగా ఎంపిక చేసి ఒకేసారి జాబితా విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే జూన్ వరకు ఈ టెన్షన్ తప్పదని, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఓవరాల్గా రెన్యువల్ అయ్యేవి మాత్రం చాలా తక్కువేనన్నది పార్టీ ఇంటర్నల్ టాక్.