వాళ్ళంతా వెళ్ళిన చోట సంతోషంగా లేరా? బాగా రాజకీయ ఉక్కపోత ఫీలవుతున్నారా? ఎప్పుడెప్పుడు బయటపడదామా అంటూ టైం కోసం ఎదురు చూస్తున్నారా? అటు ఒకప్పుడు హవా నడిపి, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న నాయకులు సైతం ఫ్యాన్ కిందికి చేరితే హాయిగా ఉంటుందని భావిస్తున్నారా? ఎవరా నాయకులు? ఏంటా ఘర్ వాపసీ మంత్రం? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయాక రాజకీయ సమీకరణలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో మారిపోయాయి. అంతకు ముందు జగన్ కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల నాని, మోపిదేవి వెంకట రమణ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరిపోయారు. వీరితో పాటు ఏడుగురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్బై చెప్పి కూటమి గూటికి చేరారు. చేరేవరకు అంతా హ్యాపీగానే ఉన్నా…. ఈ వలస నేతలందరికీ ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. పార్టీ మారిన తర్వాత ఈ నేతలకు ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇంటి కూటికి, బంతి కూటికి చెడ్డట్టుగా మారిందని అంటున్నారు. జనసేనలో చేరి రాష్ట్ర స్థాయి ప్రాధాన్యాన్ని ఆశించినా…. చివరికి జిల్లా పార్టీలో కూడా ఆయన మాటకు అంత విలువ లేకుండా పోతోందన్నది లోకల్ టాక్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హామీలు ఇచ్చినా అమలు కావడంలేదని, ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో బాలినేని ఉన్నారన్నది ఒంగోలు వాయిస్. ఇక చీరాల రాజకీయాల్లో ఒకప్పుడు హవా నడిపిన ఆమంచి కృష్ణమోహన్ కూడా ఇప్పుడు డైలమాలో ఉన్నారట.
గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కక కాంగ్రెస్లో చేరి ఓడిపోయాక రాజకీయంగా సైలెంట్ అయ్యారాయన. గతంలో ఏ పార్టీలో ఉన్నా ప్రభావం చూపిన ఆమంచి ఇప్పుడు మౌనంగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని..కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కూడా నిర్వహించారు. ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరినా…. పెద్దగా గుర్తింపు దక్కలేదని ఫీలవుతున్నారట. అటు మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. జనసేనలో చేరి ఏడాదిన్నర గడుస్తున్నా… ఆశించిన స్దాయిలో గుర్తింపు లేదని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది. ఇక మరో నేత జంగా కృష్ణమూర్తి రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది. కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరి.. 2019లో ఎమ్మెల్సీ పదవి, కీలక బాధ్యతలు దక్కించుకున్నారాయన. 2024 ఎన్నికల నాటికి వైసీపీ మీద అసంతృప్తితో టీడీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వచ్చాక టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కింది జంగాకు.
కానీ… ఆ తర్వాతి పరిణామాలతో ప్రస్తుతం ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు మరో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్, శిద్దా రాఘవరావు, గ్రంధి శ్రీనివాసరావు వంటి నేతలు ఏ పార్టీలో చేరకపోయినా రాజకీయంగా సైలెంట్ మోడ్లో ఉన్నారు. వీరందరి ఆలోచనలు తిరిగి వైసీపీవైపు తిరుగుతున్నాయన్నది తాడేపల్లి టాక్. అప్పట్లో వైసీపీని బలహీనపర్చడానికే చేరికల్ని ప్రోత్సహించారేగానీ…. తర్వాత వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశం కూటమికి లేదన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి ఏపీ రాజకీయవర్గాల్లో. ఈ క్రమంలో…. కూటమి పార్టీల్లో చేరిన వారితో పాటు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కడా బయటపడలేదు గానీ…. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఘర్ వాపసీ మంత్రం పఠించాలని అనుకుంటున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వారి మనసులో ఏముంది, రీ జాయినింగ్స్ విషయంలో జగన్ ఎలా ఆలోచిస్తారు? 2029 టార్గెట్గా పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ టాపిక్.