మాజీ మంత్రి సుచరిత వైసీపీకి దూరం కాబోతున్నారా? అందుకు కారణం పార్టీపై ఆమె అసంతృప్తి అని కొందరు.. అనారోగ్యం వల్ల అని ఇంకొందరిలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తన భర్త ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటా అన్న ఆమె మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి? మంత్రి పదవి పోవడంతో అసంతృప్తిగా ఉన్న సుచరిత వేరే ఆలోచనతో ఉన్నారా? సుచరితకు నిజంగా పార్టీ మారాలన్న ఆలోచన ఉందా.. లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి పని చేస్తుందా?
మంత్రి పదవి పోయినప్పటి నుంచీ పార్టీ కార్యక్రమాలకూ దూరం..!
మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తాజా రాజకీయ కామెంట్లపై ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. సుచరిత త్వరలోనే వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోతారని.. తాజాగా ఆమె చేస్తున్న కామెంట్లతో పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటిని ఆమె ఎప్పుడూ.. ఎక్కడా ఖండించ లేదు కూడా. 2019కి ముందు జగన్ వెంటే నేనుంటా అంటూ ముందు వరుసలో ఉండే సుచరిత హోం మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి పార్టీకి నియోజకవర్గంలో కార్యక్రమాలకు దూరంగా జరుగుతున్నారట.
మంత్రి పదవి పోవడంపై ఓపెన్గానే అసంతృప్తి వ్యక్తం చేశారు
సుచరిత ఆరోగ్యంపై కొంత సందిగ్ధం ఉంది. కరోనా తర్వాత మునుపటిలా చురుకుగా లేరు. హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకసార్లు అనారోగ్యంతో కార్యక్రమాలకు దూరమయ్యారు. ఐనా ఏరోజు పార్టీని వదిలి వెళతారని.. పార్టీకి దూరమవుతారని ప్రచారం జరగలేదు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి దూరమైంది. ఆ పరిణామాల మీద సుచరిత బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనతోపాటు కేబినెట్లో ఉన్న తానేటి వనిత, ఇతర దళిత మంత్రులు సురేష్, విశ్వరూప్, నారాయణస్వామిలను కేబినెట్లో కొనసాగించి తనను ఒక్కదాన్నే తొలగించడంతో ఆమె హర్ట్ అయ్యారు. అక్కడి నుంచే సుచరిత పార్టీకి దూరమవుతారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆమె వర్గీయులు, బంధువులు సుచిరత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నామంటూ మీడియాతో చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత అధిష్టానం సర్ది చెప్పడంతో కూల్ అయ్యారు. ఇంతలో సుచరితకు వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు అప్పగించారు.
సుచరిత భర్త దయాసాగర్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం
జడ్పిటిసి నుంచి హోంమంత్రిగా ఎదిగిన సుచరిత రాజకీయాలకు కొత్త కాదు. అలా అని రాజకీయాల్లో చేయి తిరిగిన నాయకురాలు కాదు. అప్పట్లో వైఎస్ఆర్.. తర్వాత వైసీపీ బలంతో.. జగన్ హవాలో సాధించిన విజయాలు తప్ప నియోజకవర్గంలో బలమైన ముద్ర వేయలేదు. కానీ.. 2019లో ఎన్నికల్లో గెలిచిన సుచరితకు హోంమంత్రి పదవి ఇచ్చారు జగన్. ఐటి శాఖలో కీలక అధికారిగా పనిచేసి ఇటీవల రిటైర్డ్ అయిన సుచరిత భర్త దయాసాగర్ బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడులో ఎమ్మెల్యేగా సుచరిత, బాపట్ల ఎంపీగా దయాసాగర్ పోటీ చేయాలన్న ఆలోచనలోనూ ఉన్నట్టు.. ఆ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తర్వాత చూద్దాంలే అని పార్టీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. దయాసాగర్ను సీఎంవోలో సలహాదారుగా తీసుకుంటామని హామీ ఇచ్చారని ప్రచారం నడుస్తోంది.
సుచరిత ప్లేస్లో దయాసాగర్ పోటీ చేస్తారా?
రాబోయే ఎన్నికల్లో సుచరిత ప్లేస్లో ఆమె భర్త దయాసాగర్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. తాజాగా సుచరిత చేసిన కామెంట్లు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయట. తన భర్త వేరే పార్టీలో ఉంటే తాను వైసీపీలో కొనసాగలేనని చెప్పిన సుచరిత ఆ తర్వాత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ మారే యోచన లేకపోతే సుచరిత నోటి నుంచి ఆ కామెంట్లు ఎందుకు వచ్చాయి? అనేది ప్రశ్న. సుచరితకు పార్టీపై ఉన్న అసంతృప్తి కంటే ఆమె భర్త దయాసాగర్కే పార్టీపై అసంతృప్తి ఎక్కువైంది అనే టాక్ నడుస్తోంది. తనకు సీటు కేటాయించాలని పట్టుబడుతున్న దయాసాగర్ ఆ విషయాన్ని ఎక్కడ బయటకు కనపడకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అంతర్లీనంగా తాను రాజకీయంగా యాక్టివ్ అవ్వాలన్న ఆలోచనలో సుచరిత భర్త దయాసాగర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సుచరిత ఎక్కడ రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళిన దాదాపుగా ఆమె భర్త కూడా వెళ్తున్నారు.
భర్తకూ సీటు ఇవ్వాలనే డిమాండ్ పెట్టారా?
తన భర్త వేరే పార్టీలోకి వెళ్ళిపోతే నేను వైసీపీలో కొనసాగలేను అని అధిష్టానానికి పరోక్షంగా చెప్పదలుచుకున్నారా? లేక తను పార్టీలో కొనసాగాలంటే తన భర్తకు కూడా సీటు ఇవ్వాలని డిమాండ్ ను అధిష్టానం ముందు ఉంచారా? అనేది తేలాల్సి ఉంది. సుచరిత వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా భార్యాభర్తలు స్పందించలేదు. వార్తలు ప్రసారం అవుతున్నా పట్టనట్టు ఉన్నారు. తీరా రెండు రోజుల తర్వాత అలాంటిదేం లేదంటూ చెప్పుకొన్నారు. చివరకు ఏం చేస్తారో ఏమోకానీ.. జగన్ విధేయురాలిగా ఉంటూ హోంమంత్రి స్థాయికి ఎదిగిన సుచరిత గుంటూరు రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నారు.