Off The Record: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్… రాజ్యసభకు వేసిన నామినేషన్ రిజెక్ట్ అవడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళేందుకు ఆమె నామినేషన్ దాఖలు చేయగా… తెలంగాణలో నమోదైన ఓ కేసు వివరాలు తెలపలేదంటూ… తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. ఇక్కడే సరికొత్త అనుమానాలు వస్తున్నాయి పార్టీ వర్గాల్లో. మీనాక్షిపై తెలంగాణలో కేసు నమోదైతే… ఆ సంగతి మధ్యప్రదేశ్ నేతలకు ఎలా తెలిసింది..? అందుకు కారకులు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా లీకు ఇచ్చి ఉంటారా..? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్ నేతలే లీకులిచ్చారా…? లేక కమలం అధిష్టానం తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ ఇస్తే… వాళ్లే పని పూర్తి చేశారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు చాలామంది. అసలు ఇలాంటి చర్చకు బీజేపీ నేతలే అవకాశం ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారంటూ మధ్యప్రదేశ్ కాషాయ లీడర్స్ కామెంట్స్ చేశారు. పైగా…మీ లీకు వీరులను అదుపులో పెట్టుకోండంటూ… కాంగ్రెస్ నాయకత్వానికి ఉచిత సలహా కూడా పడేశారట. దీని గురించే ఇప్పుడు గాంధీభవన్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ మాటలు తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు పెట్టే ప్లాన్ భాగం అయితే కావచ్చుగానీ….మనలో కూడా కొందరి తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్న చర్చలు కాంగ్రెస్ సర్కిల్స్లో జరుగుతున్నాయట. కానీ… రాష్ట్ర పార్టీలో చాలా మందికి అసలు ఈ విషయమే తెలియదని అంటున్నారు. కోర్టులో మీనాక్షి నటరాజన్ తరఫున అడ్వకేట్స్ కౌంటర్ దాఖలు చేశారన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. అయితే… విషయం బయటికి ఎలా వచ్చిందన్నది అసలు చర్చ. ఇది ఇంటి దొంగల పనా…లేక బయటి వాళ్ళ పనా అన్న ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికైతే లేదు.
అయితే.. సదరు బాధితురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ స్కూటినీ కంటే ముందు రోజే విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేశారని సమాచారం. దాని ఆధారంగా బీజేపీ నేతలు ఆరా తీస్తే… కేసుకు సంబంధించిన వివరాలన్నీ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వాళ్ళు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ఉండవచ్చన్న మరో డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ అంటే పొసగని వాళ్లే ఈ పని చేసి ఉంటారన్నది ఇంకో డౌట్. ఈమధ్య కాంగ్రెస్లో సొంత పార్టీ నాయకుల మీదనే వరుసగా లీకులిచ్చి రాయిస్తున్నారని వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో మీనాక్షిపై కేసు కూడా అలాగే బయటకు వచ్చిందా..? అనే అనుమానంగా బలంగా ఉందట. పార్టీ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. అసలు మీనాక్షి నటరాజ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదని, అలాంటి కేసును పట్టుకుని బీజేపీ కుట్రపూరితంగా నామినేషన్ తిరస్కరించేలా చేసిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా…. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్తో కాంగ్రెస్ మాత్రం కొంత తలనొప్పి వచ్చి పడిందన్నది రాజకీయ వర్గాల మాట. కేసుకు సంబంధించి కోర్ట్లో కౌంటర్ దాఖలు చేసిన అంశాన్ని పొందుపరిచినా బాగుండేదనే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ… సొంత పార్టీ నేతల మీద అనుమానాలు తెర మీదకు తెచ్చే స్కెచ్ మాత్రం బీజేపీ వేసిందని అంటున్నారు హస్తం లీడర్స్.

