Off The Record: ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో కాస్త నత్త నడకన నడిచినా….. ఎప్పుడైతే…మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దానికి సంబంధించిన టిప్ ఇచ్చారో… ఆ తర్వాతి నుంచి ఇక దూకుడు పెంచింది సిట్. లిక్కర్ స్కాంలో కర్త.. కర్మ.. క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పటం.. ఇక సిట్ అధికారులు ఆయనతో మొదలు పెట్టి భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకూ అరెస్టులు చేయటం సంచలనం అయింది. తాజాగా అంతకు మించిన పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించడం తాజా పరిణామం. అదే సమయంలో గోవిందప్ప బాలాజీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి… ఈ ముగ్గురే ఈ కేసులో కీలకమని సిట్ వైపు నుంచి లీకులు వస్తుండటం కలకలం రేపుతోంది. దర్యాప్తు బృందం అన్ని దశలూ దాటుకుని జగన్ ఓఎస్డీ, ధనుంజయ్రెడ్డి దాకా వచ్చేసింది గనుక ఇక సిట్ తదుపరి టార్గెట్ అసలు బాసేనా అన్న చర్చ మొదలైంది వైసీపీ వర్గాల్లో. అదే పార్టీ వర్గాలను కలవరపెడుతోందట. నిన్న మొన్నటి వరకూ ఈ కేసులో ఏం కాదులే అన్నట్టు లైట్ తీసుకున్న వైసీపీ శ్రేణులు ప్రస్తుతం… దారులన్నీ అటువైపే వెళ్తున్నందున ఏం జరగబోతోందోనని టెన్షన్ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Single : రూ.25 కోట్లు దాటిన శ్రీవిష్ణు ‘సింగిల్’ కలెక్షన్లు
లిక్కర్ స్కాంతో తమకేమీ సంబంధం లేదని, వివరాలు తెలియవని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే… ఇందులో 33వ నిందితునిగా ఉన్న గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు ఇద్దరి మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చటం.. ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించాడని రిపోర్టులో పేర్కొనటం కీలకంగా మారింది. అయితే… ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని… తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరంతా వ్యవహరించారంటున్న సిట్ లీకులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. సిట్ అధికారులు తమ పార్టీ నేతలను కుట్ర పూరితంగా ఈ కేసులో ఇరికించేందుకు ఊహాజనిత కథను అల్లుతున్నారంటూ మండిపడుతున్నాయి వైసీపీ వర్గాలు. తమ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులు పెడుతున్నారన్నది ఫ్యాన్ పార్టీ కేడర్ వెర్షన్. టీడీపీ నేతలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారని.. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారంటున్నారు. వైసీపీ ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని.. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించి.. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించినప్పుడు స్కామ్ ఏంటన్నది వాళ్ళ ప్రశ్న.
Read Also: Kangana Ranaut: ట్రంప్పై కంగనా రనౌత్ పోస్ట్.. నడ్డా ఆదేశాలతో తొలగింపు.. పోస్ట్లో ఏముందంటే..!
అసలు తమ పార్టీ అధినేతను నేరుగా టార్గెట్ చేయటం కోసమే లేని లిక్కర్ స్కాంను సృష్టించారన్నది వాళ్ళ అభియోగం. అయితే… అదే సమయంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం పార్టీలో టాప్ బాటమ్ చర్చ జరుగుతోందట. వ్యవహారం జగన్ ఓఎస్డీ దాకా వచ్చినందున ఫైనల్గా ఆగేది అక్కడేనా అంటూ పార్టీ నాయకులు పరస్పరం క్వశ్చన్ పేస్లు పెట్టుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు జగన్ కూడా తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అరెస్టు పట్ల విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే… మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తనతో ఈ విషయాన్ని ప్రస్తావించిన పార్టీ నాయకుల దగ్గర అన్నారట. దీంతో… లిక్కర్ స్కాం దర్యాప్తులో తదుపరి ఏం జరగబోతోంది? అరెస్టులు కొనసాగుతాయా.. ఎక్కడ వరకు వచ్చి ఆగుతాయోనని ఉత్కంఠగా చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.