YV Subba Reddy: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు.. అందరూ సమానమే అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు తనకు అనుకూలంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు.. 2014 నుంచి 2019 వరకు వివిధ పథకాల ద్వారా.. వివిధ స్కీమ్ల ద్వారా భారీ దోపిడీ జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డులో భారీ స్కామ్లు జరిగాయని ఆరోపించిన ఆయన.. కోర్టు సాక్షాదారాలు అన్ని పరిశీలించిన తర్వాతే చంద్రబాబును రిమాండ్కి తరలించిందన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని మేనేజ్ చేసుకోవడానికి అలవాటు పడ్డాడు.. 2014లో ఓటుకు నోటు కేసును కూడా ఇలాగే మేనేజ్ చేశాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి ఈ రోజుకి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని మండిపడ్డారు మాజీ ఎంపీ, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ రోజు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు.. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. మరోవైపు.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనున్న విషయం విదితమే.