తెలంగాణ బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ కూడా అని ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. మీరిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని అన్నారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారు. మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. ఇలా అనేక వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలని అన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా..? అని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ.. ఇక అమలుకానట్టేనని కిషన్ రెడ్డి తెలిపారు.
America: అమెరికాలో మరో భారతీయుడు హత్య
రైతుల కోసం వరంగల్ లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాల్లో మొదటి సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారు.. వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామ పరిపాలన కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులను తొలగించి, ప్రత్యేక అధికారులను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బలోపేతం గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.. అంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించనట్లేనా..? అని ప్రశ్నించారు.
Etela Rajender: ఈ ఏడాదిలో రుణమాఫీ చేస్తారా లేదా చెప్పాలి..
బడ్జెట్లో వైద్యరంగానికి రూ. 11 వేల కోట్లు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమలు చేస్తోందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎలా అమలు చేస్తారు? అని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు మీరు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు.. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నారు. బడ్జెట్ లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్ధానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ. 7,700 కోట్లు మాత్రమేనని తెలిపారు. విద్యారంగం గురించి మీరు చెప్పిన అంశాలన్నీ నీటిమీద రాతలేనని స్పష్టమైంది. అసలు బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదని అన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోంది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసమని విమర్శించారు.