అమ్మవారి శక్తి స్వరూపాలు… సృష్టికి మూల కారకులు… కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి పాపలా కాపాడుతున్న స్త్రీ మూర్తులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే.. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే.. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి… ఆ తరువాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కానేకాదని అన్నారు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ అని తెలిపారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఏ మహిళల చేతిలో డబ్బు ఉందో ఆ కుటుంబం, ఆ దేశం సురక్షితంగా, ప్రగతి పథంలో నడుస్తుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. మహిళకు ఆర్ధిక మంత్రి పగ్గాలు అప్పగించడంతో పాటు కేంద్ర కేబినెట్లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత భాగస్వామ్యం కల్పించారని బండి సంజయ్ వెల్లడించారు.
Karnataka: ఉమెన్స్ డే రోజు దారుణం.. ఇజ్రాయెల్ టూరిస్ట్పై గ్యాంగ్రేప్
దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లను కట్టించి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి తాళాలు అప్పగించడంతోపాటు.. మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు సిద్ధమైన నాయకుడు మోదీ అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మహిళల పేరుతో 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 25 కోట్ల మంది మహిళలకు 10 లక్షల కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి.. అక్కా చెల్లెళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తూ ‘‘మహిళా శక్తి’’కి అసలైన నిర్వచనం చెబుతూ మహిళా సాధికారత అంటే ఏమిటో చేతల్లో చూపుతున్న మహనీయుడు అని పొగిడారు. దేశంలోని 11 కోట్ల మంది ఉజ్వల కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యి బాధ లేకుండా చేసి మహిళల కంట కన్నీరు తుడిచింది మోదీ అని పేర్కొన్నారు. బేటీ బచావో -బేటి బచావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
AVK GROUP : వెస్ట్ ఫీల్డ్స్ లో పెట్టుబడి మీ భవితకు భరోసా!
‘మహిళా శక్తి’ అంటే మహిళా దినోత్సవం నాడే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి.. పత్రికల్లో, టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలిస్తూ ప్రచారం చేసుకోవడం కాదని బండి సంజయ్ అన్నారు. ఆచరణలో చూపాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2500లు ఇస్తామన్నారు.. 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. బడ్జెట్లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదు.. మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం నాడు మాత్రమే ‘మహిళలను శక్తి’గా మారుస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే నమ్మేదెవరు..? అని విమర్శించారు. రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న తెలంగాణ మహిళలు చైతన్యవంతులు అని అన్నారు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్రు కాల్చివాత పెట్టడం తథ్యం అని బండి సంజయ్ పేర్కొన్నారు.